విప్లవాత్మక మార్పులు తెస్తుంది.. ఎఫ్ఎం ట్రాన్స్‌మిటర్ల ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ

by Vinod kumar |
విప్లవాత్మక మార్పులు తెస్తుంది.. ఎఫ్ఎం ట్రాన్స్‌మిటర్ల ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం 91 ఎఫ్ఎం ట్రాన్స్‌మిటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది రేడియో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెస్తుందన్నారు. అంతేకాదు సాంకేతిక పరిజ్ఞానంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని చెప్పారు. రేడియోతో తన తరానికి ఉన్న సంబంధాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఈ ఆదివారం జరగబోయే మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ను ప్రస్తావిస్తూ హోస్ట్‌గా రేడియో మాద్యమంతో తనకు సంబంధం ఉందన్నారు.

దేశ ప్రజలతో ఈ రకమైన భావోద్వేగ అనుసంధానం రేడియో ద్వారా మాత్రమే సాధ్యమైందని ఆయన చెప్పారు. మన్ కి బాత్ ద్వారా స్వచ్ఛ భారత్ అభియాన్, బేటీ బచావో బేటీ పడావో, హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలు ప్రజా ఉద్యమాలుగా మారాయని మోడీ అన్నారు. ‘ఒక విధంగా చెప్పాలంటే నేను మీ ఆల్ ఇండియా రేడియో టీమ్‌లో సభ్యుడిని’ అని ప్రధాని చెప్పారు. 85 జిల్లాల్లో రెండు కోట్ల మందిని కవర్ చేసే 91 ట్రాన్స్‌మిటర్లను ప్రధాని వర్చువల్ ద్వారా ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. గత కొన్నేళ్లుగా దేశంలో సాంకేతిక విప్లవాన్ని రేడియో.. ముఖ్యంగా ఎఫ్ఎం కొత్త రూపంలో అందించిందని మోడీ అన్నారు.

Next Story